భగవద్గీతలో కృష్ణ భగవానుడు మనకు మనము మిత్రులము, మనము మనకు శత్రువులము అంటారు. ఉచ్చుల్లో పడ్డ ఒక కోతి కథ ఈ విషయాన్ని మరింత తేలిగ్గా అర్ధం చేసుకోవటానికి ఉపయోగ పడుతుంది. సన్నమూతి ఉన్న ఒక కుండ (కూజా)లో కొన్ని శెనగ గుళ్ళు ఉన్నాయి. అందులో కోతి చెయ్యి అతి కష్టం మీద పడుతుంది. కోతి తన చేతిని ఆ కుండ యొక్క మూతిలో అతి కష్టంగా దూర్చి చేతినిండా గింజలను పట్టుకుంది. చేతినిండా గింజలు ఉండడంతో చేతి పరిమాణం పెరిగి కుండ నుంచి బయటకు రాలేక పోతుంది. గుప్పిట నిండా గింజలు పట్టుకుని తన చేతిని బయటకు తీయడానికి కోతి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఎవరో దానికోసం ఉచ్చు బిగించారని అది భావిస్తుంది కానీ ఆ ఉచ్చును తనకు తానే ఏర్పరుచుకుందని ఎన్నడూ గుర్తించదు. మనము ఏ విధంగా వివరించినా కూడా ఆ కోతి ఆ గింజలను వదలదు; బదులుగా మనమే దాని గింజలను చేజిక్కించుకునేందుకు చూస్తున్నామని భావిస్తుంది. బయటి నుంచి చూస్తే అది కొన్ని గింజలను పడేస్తే గుప్పిట వదులై, దాని చెయ్యి బయటికి వస్తుందని తెలుస్తుంది. మనం అనూహ్య పరిస్థితుల్లోనో, విషమ పరిస్థితుల్లోనో చిక్కుకుని ఉన్నప్పుడు ఈ చిన్న విషయాన్ని గుర్తించడమే ఒక నిజమైన పరీక్ష. మూసిన గుప్పిట మనకు శత్రువు, తెరిచిన గుప్పిట మనకు స్నేహితుడు. గుప్పిట తెరవాలా, ముయ్యాలా అన్నది మన చేతుల్లోనే ఉంది. దీన్ని బట్టే మనకు మనం మిత్రుడు లేక శత్రువుగా మారతాము. జీవితంలో మనం ఇటువంటి ఎన్నో ఉచ్చులను ఎదుర్కొంటాము. ఆ గింజలు మరేమిటో కాదు 'నేను',' నాది', 'నాకు', 'నన్ను' వంటివి; అహంకారం మన చేతిని వాటికి కట్టిపడేస్తుంది. భగవద్గీత ఎన్నో విధాలుగా పదేపదే మనకు చెప్పేది ఏమిటంటే అహంకారాన్ని విడనాడమని! అప్పుడు మనం ఈ ఉచ్చుల నుండి విడివడి పరమ స్వేచ్ఛ అంటే మోక్షం దిశగా పయనిస్తాము. రణగొణ ధ్వనులతో వేగంగా పరుగులు తీసే ప్రపంచంలో మనం కాస్త నెమ్మదిస్తే, ఈ ఉచ్చులను గుర్తించడం చాలా సులభం. ఇటువంటి సాక్షాత్కారాలను పొందడానికి కోవిడ్-19 మనకు ఇచ్చిన అవకాశమే సరైన సమయం.