7. నిమిత్తమాత్రులుగా ఉండడం

భగవద్గీత యుద్ధక్షేత్రంలో పుట్టింది. ప్రస్తుతం కోవిడ్ - 19 రోజులు కూడా ఈ కురుక్షేత్ర యుద్ధం లాగే ఉన్నాయి. దీనినే భగవద్గీతలోని 'నిమిత్తమాత్రులం' అనే పదము ఈ పరిస్థితులను చక్కగా సంగ్రహిస్తుంది. నిమిత్త మాత్రులం అంటే ఆ భగవంతుని చేతుల్లో ఒక పరికరంలా ఉండడం.

అర్జునుడు కృష్ణుని యొక్క వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా (యథార్ధంగా) చూడాలనుకున్నాడు. అంధునికి ఏనుగును పూర్తిగా చూడడానికి ఒక కన్ను అవసరమైనట్లే అతనికి కూడా దాన్ని గ్రహించడానికి అదనపు ఇంద్రియం అవసరమయ్యింది.

తన విశ్వరూపాన్ని చూడడానికి కృష్ణ భగవానుడు అతనికి దివ్య దృష్టినిచ్చారు. తన వాస్తవికతను చూపించడంతో పాటు శ్రీకృష్ణుడు అతనికి భవిష్యత్ దర్శనప్రాప్తిని కూడా కలిగించారు, అందుకే అర్జునుడు అనేక మంది యోధులు మృత్యుముఖంలోకి ప్రవేశించడాన్ని చూశాడు.

ఈ యోధులంతా త్వరలోనే చనిపోతారని, ఆ ప్రక్రియలో నీవొక పరికరానివి మాత్రమేననీ భగవంతుడు చెబుతారు. మొదట శ్రీకృష్ణుడు అర్జునుడు కర్త కాదని చెబుతాడు. అర్జునుడు కనుక విజేతగా తిరిగి వస్తే, విజయమే అహంకారానికి అతి పెద్ద ప్రోత్సాహకం కనుక, అతడు అహంకారం నుంచి విముక్తిని పొందడానికి ఈ విధముగా బోధిస్తున్నారు. అదే సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని యుద్ధ క్షేత్రాన్ని వదిలి వెళ్ళనివ్వరు. 'నిమిత్తమాత్రులు'గా ఉండడం అంటే ఆత్మ జ్ఞానంతో, అహంకార రహితులుగా ఉండటం.

కోవిడ్-19 సమయంలో వీధిలో నిలబడ్డ వ్యక్తికైనా లేక నియంత్రించే వ్యక్తికైనా, అర్జునుడి వంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. సమీప భవిష్యత్తులో ఏ చికిత్సా కనపడక, మనందరం నిమిత్తమాత్రలుగా (అంతర్గతంగా) ఉంటూ మనకు ఇవ్వబడిన పాత్రను (బాహ్య ప్రపంచంలో) వీలైనంత బాగా పోషిస్తూ ఉండటమే నిమిత్తమాత్రత. ఈ చిన్న అవగాహన, జ్ఞానం అనేక అంశాలకు వరం కావచ్చు, ఎందుకంటే, జీవితాన్ని అనుభూతి చెందుతూ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటే తప్ప భగవద్గీత స్పష్టంగా అర్థం కాదు.

ఉదాహరణకు, ఒక చిన్న బొగ్గు ముక్క అమితమైన ఒత్తిడిలో వజ్రంగా మారుతుంది; బంగారం కాలితేనే స్వచ్చమవుతుంది. ఇటువంటి పరీక్షా సమయాలు నిమిత్త మాత్రంగా ఉండటమన్న వాస్తవికత గురించి అవగాహన కలగడానికి వేదికలవంటివి. ఈ చిన్న అవగాహనకు మనల్ని శరణాగతి పథంలో అంతరాత్మ వైపు తీసుకువెళ్లే సామర్థ్యం ఉంది.