మొత్తం భగవద్గీతని ఒక్క పదంలో చెప్పాలంటే 'ద్రష్ట' (సాక్షి) గా చెప్పవచ్చు, ఇది అనేక సందర్భాలలో మనకు కనిపిస్తుంది. మనలో చాలామంది మనమే అన్నీ చేస్తామని, పరిస్థితులను నియంత్రిస్తామని అనుకుంటూ ఉంటాము కనుక నిజాన్ని అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి 60 ఏళ్ల వయసు. అప్పటికే అతడు మంచి జీవితాన్ని గడిపి అన్ని విలాసాలను అనుభవించాడు. ఒక యోధుడిగా అతడు యుద్ధ క్షేత్రంలో అనేకసార్లు విజయాన్ని చవి చూశాడు. యుద్ధ సమయంలో అతడు తానే కర్తనని (అహం కర్త - అహంకారం), తన బంధుమిత్రుల చావుకు తానే బాధ్యుడనని భావించడం వలన యుద్ధ క్షేత్రంలో అతడు విషాదానికి లోనయ్యాడు. అతడు 'కర్త' కాదని, కృష్ణ భగవానుడు అతనితో చెప్పే ప్రయత్నమే భగవద్గీత ! సహజంగా తర్వాతి ప్రశ్న. 'ఒకవేళ నేను కర్తను కాకపోతే మరి ఏమిటి?' భగవానుడు భగవద్గీతలో అర్జునుడితో నీవు 'ద్రష్ట' అంటే సాక్షివని చెబుతారు. 60 ఏళ్ల జీవితంలోని మంచి, చెడు అనుభవాల వల్ల అర్జునుడు తాను కేవలం ఒక 'సాక్షి' ని మాత్రమే కానీ 'కర్త' ను కాదు అన్న భావనను జీర్ణించుకోలేకపోతాడు. శ్రీకృష్ణ పరమాత్మ శ్రమ కోర్చి చేసిన వివరణ అర్జునుడికి ఈ నిజాన్ని గ్రహింప చేస్తుంది. చాలా సంస్కృతులు మనం కేవలం 'ద్రష్ట' లము మాత్రమేనని చెప్పినా కూడా, ఆధ్యాత్మిక ప్రయాణపు ఆరంభ దశలో ఉన్న వాళ్ళు ఈ భావనను అర్ధం చేసుకోలేక గందరగోళానికి గురవుతారు. ద్రష్ట (సాక్షి) అనేది ఒక జ్ఞాన స్థితి; భౌతిక ప్రపంచంలో వ్యక్తీకరించబడేది కాదు. రోజువారీ జీవితంలో మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు, పరిణామాల నుండి ఓ అడుగు వెనక్కు వేసి అంతర్గత స్థిరత్వాన్ని కలిగి ఉండే సామర్ధ్యమే ఈ సాక్షి భావం. సుఖదుఃఖాలు అందించే గుణం వస్తువుల్లో ఉన్నప్పటికీ ఎటువంటి నిర్దిష్ట ఫలితాన్ని ఆశించకుండా పని చేయడానికి సిద్ధపడటమే సాక్షిభావం. ఇది మన భావనలను సాక్షిగా గమనించుకుంటూ వాటిని అధీనంలో ఉంచుకునే సామర్ధ్యమే.