ద్వంద్వాతీతం అంటే ద్వంద్వాలను/విరుద్ధ భావాలను అది గమించడం. భగవద్గీతలో ఉన్న మరొక అమోముమైన ఉపాయం ఇది. అర్జునుడిని ఈ స్థితికి చేరమని చెబుతూ శ్రీకృష్ణుడు వేర్వేరు సందర్భాలలో అనేక సలహాలను ఇస్తారు.

“సుఖాన్ని పొందడానికి మనం చిత్తశుద్ధితో కష్టపడి పని చేసినా కూడా బాధ/దుఃఖం మనకు ఎలా కలుగుతాయి?” అన్నది మానవాళిని ఉత్కంఠకు గురిచేసే సాధారణ ప్రశ్న. మన లోపలికి చూసే బదులు మన ప్రయత్నాలు సరిపోలేదని మనల్ని మనమే సమాధాన పరచుకుంటాము. కానీ ఆశతో కూడుకున్న అహంకారం సుఖాన్ని పొందడం కోసం తిరిగి మనం ఇదే ప్రక్రియను మొదలు పెట్టేలా ప్రేరణ కలిగిస్తుంది; ఇలా జీవితం ముగిసే దాకా కొనసాగుతుంది. ద్వంద్వాతీతము అన్న దాన్ని అర్థం చేసుకోవడమే ఈ ప్రశ్నకు సమాధానం.

వ్యక్తమయ్యే ప్రపంచంలో ప్రతిదీ దాని విరుద్ధ ధృవంతో (ద్వంద్వ) పాటే ఉనికిని కలిగి ఉంటుంది. పుట్టుకకు వ్యతిరేక ధృవం చావు; సుఖానికి దుఃఖం, గెలుపుకి ఓటమి; లాభానికి నష్టం; కలయికకు విడిపోవడం; పొగడ్తకు విమర్శ; షరతులతో కూడిన ప్రేమకు ద్వేషం; ఇలా ఈ జాబితా అనంతంగా సాగుతూనే ఉంటుంది.

ఇక్కడ నియమం ఏమిటంటే, మనం వీటిలో ఒక దాని వెంటపడుతూ ఉంటే దాని విరుద్ధ ధృవం దానంతటదే మనల్ని అనుసరిస్తుంది. ఒక కర్రని మనం ఒక వైపు నుంచి ఎత్తినప్పుడు రెండవ కొస కూడా పైకి లేస్తుంది కదా? లోలకాన్ని లేదా ఉయ్యాలను మరొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అది ఒక వైపు వెళితే అనివార్యంగా మరొక వైపు కూడా రావలసిందే.

ఈ ధృవ సిద్ధాంతం ప్రకారం, కోవిడ్-19 వల్ల కలిగిన బాధ కొన్నాళ్ళకు సుఖం వైపు మొగ్గుతుంది. మెరుగైన విజ్ఞానశాస్త్రం, టెక్నాలజీ ద్వారా ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులే మనకు సుఖాన్ని తీసుకురాగలిగాయని చరిత్ర చెబుతోంది. కోవిడ్-19 వంటి విపరీత ధ్రువాలకు అంతరాత్మ వైపు ప్రయాణాన్ని వేగవంతం చేసే సామర్థ్యం ఉంది.

శ్రీకృష్ణుడు మనం ఈ ద్వంద్వాలను అధిగమించాలని చెబుతారు. ఉదాహరణకు వర్తమానంలో జీవించటమే గతాన్ని, భవిష్యత్తును అధిగమించడం; షరతులతో కూడిన ప్రేమను, ద్వేషాన్ని అధిగమించి బేషరతైన ప్రేమను మనలో సాధించడం.

మనకు కావలసిందల్లా ఈ ధృవాలను గురించిన అవగాహనను కలిగి ఉండడం; వాటి మధ్య ఊగుతూ ఉన్నప్పుడు వాటిని గమనించడం. మన జీవించి ఉన్నంత కాలం, ఈ ధృవాలకు లోను కావడం సహజం కాని అవగాహన వీటిని అధిగమించేందుకు మనకు సహాయపడుతుంది.