శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్తారు “నీవు గాని, నేను గాని ఈ రాజులు గానీ ఉండని కాలమే లేదు. ఇకముందు కూడా మనము ఉండము అన్న మాటే లేదు” (2.12).

నాశనంలేని శాశ్వతమైన 'జీవన అస్తిత్వం' యొక్క 'లౌకిక భాగం' నశించడం ఖాయమని అందువల్ల ముందున్న యుద్ధాన్ని కొనసాగించవలసినదని ఆయన అన్నారు. శాశ్వతమైన 'జీవన అస్తిత్వాన్ని' ఆత్మ, చైతన్యం, అవగాహన అన్న పేర్లతో పిలుస్తాము. శ్రీకృష్ణుడు దీనినే 'దేహి' అంటారు.

శ్రీకృష్ణుడు ఈ సృష్టి యొక్క సారంతో మొదలు పెట్టి శాశ్వతమైన, అపరిమితమైన 'జీవన అస్తిత్వం ' గురించి మాట్లాడతారు. ఇదే శాశ్వతమైన అస్తిత్వానికి ఒక భౌతిక భాగం ఉంది. అది తప్పని సరిగా నాశనం అవుతుందని అంటారు. శ్రీకృష్ణుడు పాలకుల గురించి మాట్లాడినప్పుడు ఆయన వారిలోని ఉన్న శాశ్వతమైన నాశనము లేని 'జీవన అస్తిత్వం' గురించి ప్రస్తావిస్తున్నారు.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, మనందరమూ రెండు భాగాలతో నిర్మించబడ్డాము. మొదటి భాగము దేహము, మనస్సు - ఈ రెండూ తప్పని సరిగా నాశనమయ్యేవి. ఇవి సుఖదుఃఖాల వంటి ద్వంద్వాలకు లోనవుతాయి; అర్జునుడు అటువంటి భావనకే లోనవుతున్నాడు.

రెండవ భాగము శాశ్వతమైన 'దేహి'. దీనిని గ్రహించి మనల్ని శరీరం, మనస్సు (అసత్)తో గుర్తించడం మానేసి దేహి (సత్) తో గుర్తించడం ప్రారంభించాలని కృష్ణుడి ఉద్ఘాటన. బుద్ధత్వం (ఆత్మజ్ఞానం) అనేది ఈ గుర్తింపులను అధిగమించినప్పుడే కలుగుతుంది. దీని అనుభూతి చెందాల్సిందే గానీ మాటల్లో వర్ణించలేము.

యుద్ధం చేయాలని అర్జునుడిని శ్రీకృష్ణుడు చెప్పే భాగమే భగవద్గీతలో మన అవగాహనకు అత్యంత క్లిష్టమైన భాగం. కొంతమంది అసలు కురుక్షేత్ర యుద్ధమే జరగలేదని అది మన దైనందిన పోరాటాలకు రూపకం మాత్రమేనని అంటారు. అర్జునుడు దాని నుండి విరమించడం ద్వారా యుద్ధం ముగిసే అవకాశం లేదనేది కూడా నిజం.

శ్రీకృష్ణుడు అవగాహన, బోధన అనే ఆయుధాలతో యుద్ధాలను ఎదుర్కోవాలని బోధిస్తున్నారు. అహంకారం (అహం-కర్త) తో అర్జునుడు యుద్ధం నుండి వైదొలగినప్పటికి విషాదానికి శాశ్వతంగా బానిస అవుతాడని కృష్ణుడికి తెలుసు. అందుచేత శ్రీకృష్ణుడు 'సత్'ను గ్రహించి యుద్ధం చేయమని సలహా ఇస్తారు.