'సత్' (వాస్తవమైనది/ శాశ్వతమైనది) నశించదని, 'అసత్' (అవాస్తవమైనది/అశాశ్వతమైనది) కు ఎన్నడూ ఉనికి లేదని, శ్రీకృష్ణుడు చెబుతారు. జ్ఞాని మాత్రమే ఈ రెండింటి మధ్య తేడాని గమనించగలరు (2.16). 'సత్', 'అసత్' యొక్క చిక్కుముడులను అర్థం చేసుకోవడానికి అనేక సంస్కృతులలో తాడు, పాముల యొక్క భ్రాంతికి సంబంధించిన కథ ఉదహరించబడుతుంది. సంధ్యవేళ ఒక మనిషి ఇంటికి చేరుకొని, గుమ్మంలో ఒక పాము లాగా చుట్టుకుని ఉన్న వస్తువును చూస్తాడు. నిజానికి అది పిల్లలు వదిలివేసిన తాడు; మసకగా ఉండడం వల్ల పాములా కనిపించింది. ఇక్కడ తాడు 'సత్' ను, పాము 'అసత్' ను సూచిస్తుంది. అతడు 'సత్' ను అంటే తాడును గుర్తించే వరకూ తాను ఊహించుకున్న 'అసత్' అంటే పాముని ఎదుర్కోడానికి అనేక వ్యూహాలను అనుసరించే అవకాశం ఉంది. అతడు దానిపై కర్రతో దాడి చేస్తాడు లేక పారిపోతాడు లేదా నిజాన్ని తెలుసుకోవడానికి ఒక దీపాన్ని/టార్చ్ ను వెలిగిస్తాడు. మన అవగాహన అవాస్తవం మీద ఆధారపడినప్పుడు అత్యుత్తమమైన వ్యూహాలు, నైపుణ్యాలు కూడా నిష్ఫలం అవుతాయి. ఇక్కడ 'తాడు' లేకుండా 'పాము' అనే భావనకు అవకాశం లేదు అంటే వాస్తవం నుంచి అవాస్తవం తన ఉనికిని పొందుతుంది. అందువల్లనే పీడకల వచ్చినప్పుడు మన శరీరానికి నిద్రలో చెమట పట్టినట్లు అవాస్తవమైన కల కూడా మనల్ని ప్రభావితం చేయగలదు. ఏదైతే గతంలో లేదో భవిష్యత్తులో కూడా ఉండదో అదే 'అసత్' అని శ్రీకృష్ణుడు సూచించారు. ఇంద్రియాల ద్వారా మనము కలిగే సుఖాన్ని ఉదాహరణగా తీసుకుంటే, అది అంతకు ముందు లేదు; కాసేపటి తర్వాత ఉండదు. బాధ విషయంలో కూడా అంతే; ఆ మాటకొస్తే అన్ని ద్వంద్వాల విషయంలో కూడా ఇలాగే ఉంటుంది. 'అసత్' ఒక కాలపరిమితి వరకే ఉంటుందని, 'సత్' శాశ్వతమైనదని మనం గుర్తించాలి. 'సత్' అనేది శాశ్వతమైన మన అంతరాత్మ, 'అసత్' అనేది మన అహంకారం. అది అంతరాత్మ మద్దతుతో తనను తాను నిలబెట్టుకుంటుంది. మన అంతరాత్మను (తాడును) మనం గుర్తించినప్పుడు, అహంకారం (పాము) దానికదే మాయమవుతుంది.