“మోహమనెడి ఊబినుండి పూర్తిగా బయటబడినప్పుడే నీవు వినిన, వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగములనుండి వైరాగ్యము (నిర్వేదము) ను పొందగలవు” అని శ్రీకృష్ణుడు చెప్పారు (2.52). మనం మోహాన్ని అధిగమించినప్పుడు మన ఇంద్రియాల ద్వారా వచ్చే సమాచారం మనను తన ఇష్టానుసారంగా ప్రభావితం చేసే శక్తిని కోల్పోతుంది. శ్రీకృష్ణుడు 'వినికిడి' ని ఉదాహరణగా ఎంచుకున్నారు ఎందుకంటే మనం తరచుగా ప్రశంసలు, విమర్శలూ, చాడీలు, పుకార్లు వంటి ఇతరుల మాటలచే ప్రభావితమవుతాము.
ఏది మనది; ఏది కాదు అనే వాటి మధ్య తేడాను గుర్తించలేక పోవడమే మోహం. అంటే వర్తమానంలో, భవిష్యత్తులో భౌతిక ఆస్తులు మనవేనన్న యాజమాన్య భావన. వాస్తవానికి మనం వీటికి యజమానులం కాము. మనం మనది కానిదానిని అంటిపెట్టుకుని ఉండటానికి ప్రయత్నిస్తున్నప్పుడు నిజంగా మనదైన దేహి/ఆత్మను మనము గుర్తు పట్టలేక పోతాము. శ్రీకృష్ణుడు ఈ దృగ్విషయాన్ని 'కలిలం' లేదా ఆధ్యాత్మిక చీకటి అని పిలుస్తారు.
ఈ అంధకారాన్ని అధిగమించినప్పుడు మనం 'వైరాగ్యము' (నిర్వేదము) ను పొందుతామని శ్రీకృష్ణుడు చెప్పారు. నిర్వేదం ఉదాసీనతగా వర్ణించబడినప్పటికీ ఇది అజ్ఞానం నుండి పుట్టిన నిష్క్రియ లేదా ప్రతికూల ఉదాసీనత కాదు. ఇది అవగాహన, సజీవంగా ఉన్న ప్రస్తుత క్షణంలో తలెత్తే ఉదాసీనత. ఇది ఆసక్తి లేదా నిర్లిప్తత కాదు; అది అనుబంధము లేదా ఎడబాటు కాదు, కానీ వీటన్నింటినీ మించినది. ఇది తీర్పు, విమర్శలు లేని క్రియాశీల అంగీకారం.
'ఇతరుల' పై ఆధారపడే జీవితంలో మన ఆస్తులు, సామర్థ్యాలు, విజయాలు, ప్రవర్తన, రూపాలు మొదలైనవాటికి ఇతరుల ఆమోదం, ప్రశంసలకోసం మనం తహతహలాడతాము. మనం మోహాన్ని అధిగమించగలిగేంత వరకు ఈ ప్రతిఫలాల అనుభూతులను పొందడానికి జీవితాంతం కష్టపడతాము.
మోహాన్ని తెచ్చిన అంధకారాన్ని మనం అవగాహన; సమతుల్యమైన, పొందికైన బుద్ధి ద్వారా పారద్రోలితే వర్తమానంలో కానీ, భవిష్యత్తులో గాని ఇంద్రియాలు మనపై ప్రభావం చూపే సమర్ధతను కోల్పోయి మనకుబానిసలవుతాయి.