“అయుక్తుడికి బుద్ధి, భావనలు రెండూ ఉండని ఫలితంగా అతనికి శాంతి లభించదు, శాంతిలేని వారికి ఆనందం ఉండదు.” అని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు (2.66). శ్రీకృష్ణుడు సమత్వానికి (2.38, 2.48) ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తారు. ఈ శ్లోకం వేరొక దృష్టికోణం నుండి ఈ సమత్వం గురించి చెబుతుంది. తనలో తనను స్థిరపరచుకోవడం నేర్చుకునే వరకు స్నేహితులు, శత్రువు, ఉద్యోగం, జీవిత భాగస్వామి, పిల్లలు, డబ్బు, ఆనందం, అధికారం, ఆస్తులు మొదలైన వాటి పై తన మనుగడ కోసం ఆధారపడతారు. ఇదే అయుక్త యొక్క ముఖ్యమైన గుర్తింపు. ఎవరి దృష్టి డబ్బుపై కేంద్రీకృతమై ఉంటే, అతని ప్రణాళికలన్నీ ఆరోగ్యం , సంబంధాలు మొదలైన అన్ని విషయాలను పణంగా పెట్టి సంపదను పెంచుకోవడం చుట్టూ తిరుగుతాయి. ఒక వ్యక్తి సుఖాన్ని దృష్టిలో ఉంచుకుని ఉంటే, సుఖం పొందడానికి మోసం లేదా మరేదైనా చేయడానికి వెనుకాడడు. జీవిత భాగస్వామి కేంద్రంగా ఉన్న వ్యక్తి తన భాగస్వామితో ప్రపంచమంతా ఎలా వ్యవహరిస్తున్నారో అనే విషయముతోనే అందరినీ మూల్యాంకనం చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి శత్రువుపై కేంద్రీకృతమై కూడా ఉండవచ్చు. అది తమకు నష్టం కలిగించినప్పటికీ, తన శత్రువులను ఎలా దెబ్బ తీయాలనే దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. మనం ఇతరులతో ముడిపడి ఉన్నప్పుడు మన శాంతి, వారి చేతుల్లో ఉంటుంది; మనల్ని వారిపై ఆధారపడేలా చేస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు మనం మధ్యలో కేంద్రీకృతమై ఉండే సమస్థితిని గురించి నొక్కి చెప్పారు. ఇదే మోక్షం. శ్రీకృష్ణుడు 'భావం' అనే పదాన్ని ఉపయోగిస్తారు. దానిని మనం భావోద్వేగాలతో పోల్చడానికి ప్రయత్నిస్తాము. ఏదైనా వ్యక్తి లేదా వస్తువు 'నా' తో ముడిపడి ఉన్నప్పుడు లోతైన భావోద్వేగాలను ప్రేరేపిస్తుంది; లేకుంటే అవి మన హృదయాన్ని తాకను కూడా తాకకపోవచ్చు. మన భావోద్వేగాలన్నీ వ్యక్తిపరమైనవని ఇది సూచిస్తుంది. అయితే శ్రీకృష్ణుడు సమానత్వం నుండి ఉద్భవించే భావాన్ని సూచిస్తున్నారు. అది 'నేను'తో సంబంధాన్ని కలిగి ఉన్నా లేకున్నా ఒకటిగానే ఉంటుంది. మన పరిసరాలు అప్రియంగా, అస్తవ్యస్తంగా, కలవర పెట్టేవిగా ఉండవచ్చు, కానీ తటస్థంగా ఉండటం ద్వారా అంతర్గత సామరస్యాన్ని పొందిన వ్యక్తిని అవి ప్రభావితం చేయలేవు. శ్రీకృష్ణుడు దీనినే శాంతిని పొందడమని పైన సూచించారు; ఇది చివరికి మనకు ఆనందాన్ని ఇస్తుంది.