1.అహంకారంతో ఆరంభం

శ్రీకృష్ణ భగవానుడికి, యోధుడైన అర్జునుడికి కురుక్షేత్రమనే యుద్ధ క్షేత్రంలో జరిగిన 700 శ్లోకాల సంభాషణే 'భగవద్గీత.'

యుద్ధంలో తన బంధుమిత్రులు ఎంతో మంది చనిపోతారన్న భావన కలిగి, ఇది మంచిది కాదని అర్జునుడు వాదిస్తాడు. 'నేను కర్తని' - అహం(నేను) కర్త(చేసేవాడిని), అంటే అహంకారమనే భావనలో నుంచే అర్జునుని సందిగ్ధత జనించింది. ఈ అహంకారం మనం ప్రత్యేకమని చెబుతుంది, కానీ వాస్తవం ఇందుకు పూర్తి విభిన్నమైనది. మామూలుగా గర్వాన్ని అహంకారానికి అర్థంగా ఇచ్చినప్పటికీ, అహంకారం యొక్క అనేక రూపాల్లో గర్వం ఒకటిగా భావించవచ్చు.

భగవద్గీత మొత్తం, శ్రీకృష్ణుడు ఈ అహంకారాన్ని గురించి చెబుతూ, దాన్ని నిర్మూలించడానికి కావలసిన మార్గాలను, ఈ మార్గాలలో మన ప్రగతిని అంచనా వేసుకోటానికి కావలసిన మైలురాళ్ల(కొలబద్దల) గురించి బోధిస్తారు.

కురుక్షేత్రం యుద్ధ రంగాన్ని పోలిన పరిస్థితులు మనందరి జీవితాల్లోనూ ఎదురవుతాయి. అర్జనుడికి ఎదురైన సందేహాలు మన కుటుంబాల నేపథ్యంలోగానీ, పని చేసే చోట్ల కానీ, ఆరోగ్యం లేదా లాభనష్టాల విషయంలో కానీ, సంబంధాలు, బంధుత్వాలు విషయంలో కానీ ఏదో ఓ నాడు మనందరికీ ఎదరయ్యేవే. మనం బతికున్నంత కాలమూ, అహంకారం నుండి విముక్తి పొందనంత వరకూ ఈ సందేహాలు మనలను వెంటాడుతూనే ఉంటాయి.

మనమేమిటి అన్నదాని గురించి భగవద్గీత చెప్తుంది. మనకు ఏమి తెలుసు లేదా మనం ఏమి చేస్తున్నాము అన్న దాని గురించి చెప్పేది మాత్రం కాదు. పుస్తక జ్ఞానం ఎంత తెలిసినా ఎలాగైతే మనం సైకిలు తొక్కలేమో, ఈత కొట్టలేమో అదేవిధంగా జీవితాన్ని ప్రత్యక్షంగా చూడకపోతే ఎంత గొప్ప సిద్ధాంతమైనా మనకు ఉపయోగపడదు. ఇటువంటి పరిస్థితుల్లో తుది గమ్యమైన అహంకారం లేని అంతరాత్మను చేరటానికి భగవద్గీత సహాయపడుతుంది.

పైపైన చూస్తే కృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించినప్పటికీ, ఇప్పటికీ కాలం మారినట్లుగా మనకు కనిపిస్తుంది. నిశ్చయంగా, గత రెండు దశాబ్దాల్లో విజ్ఞానశాస్త్ర అభివృద్ధి వల్ల తీసుకురాబడిన మార్పు ఎంతో ఉంది. కానీ వాస్తవానికి పరిణామ పరంగా చూసినట్లయితే, మనిషి ఎదుగుదలలో ఎటువంటి మార్పు లేదు. మనందరిలోనూ అంతర్గతంగా ఉండే సందేహాలు కూడా అలానే కొనసాగుతున్నాయి. చెట్లలాగా బయటికి కనిపించే వ్యక్తీకరణలు వేర్వేరుగా ఉండొచ్చు కానీ వేళ్ల లాగా లోపలున్న సందేహాలన్నీ అలానే ఉన్నాయి.